Hyderabad Zoo: సౌదీ రాజు గిఫ్ట్గా ఇచ్చిన చీతా గుండెపోటుతో మృతి
Hyderabad Zoo: వరుస గుండె పోటు మరణాలు కలవర పెడుతున్న వేళ..మూగజీవి గుండె పోటుతో మరణించడం కలకలం రేపింది.
Hyderabad Zoo: వరుస గుండె పోటు మరణాలు కలవర పెడుతున్న వేళ..మూగజీవి గుండె పోటుతో మరణించడం కలకలం రేపింది. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఓ చీతా గుండెపోటుతో మరణించడం చర్చనీయాంశంగా మారింది. మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ గుండె పోటు మరణాలు సంభవిస్తాయని తాజా ఘటనతో వెల్లడయ్యింది. అయితే వెటర్నరీ వైద్యులు మాత్రం జంతువుల్లో గుండెపోటు మరణాలు చాలా అరుదు అని చెప్తున్నారు.
గుండెపోటు మరణాలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న వేళ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఓ చీతా మరణించడం కలకలం రేపింది. జంతువుల్లోనూ గుండెపోటు మరణాలు ఉంటాయన్న చర్చకు ఈ ఘటన తెరలేపింది. హైదరాబాద్ నెహ్రూ జూపార్క్లో అబ్దుల్లా అనే మగ చీతా చనిపోయింది. దీనికి పోస్టుమార్టం చేసిన అధికారులు గుండెపోటుతో చనిపోయినట్టు నిర్ధారించారు. 2011లో సౌదీ రాజ కుటుంబీకులు జూను సందర్శించి, జూ నిర్వహణ చూసి ముగ్దులై 2012లో ఒక జత ఆడ, మగ చీతాలను బహుమతిగా ఇచ్చారు. అప్పుడు వీటి వయసు నాలుగేళ్లు. ఆడ చీతా హీబా 12 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మృతి చెందగా అప్పటి నుంచి అబ్దుల్లా ఒంటరిగా ఉంటుంది. అయితే అబ్దుల్లా అకస్మాత్తుగా మరణించింది. దీంతో పోస్ట్ మార్టం నిర్వహించగా గుండె పోటు తో మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు
అయితే జంతువుల్లో గుండె పోటు మరణాలు ఉంటాయా అనే విషయంలో చాలా రోజులుగా చర్చ జరుగుతోందని వెటర్నరీ వైద్యులు చెప్తున్నారు. నిజానికి జంతువుల్లో గుండె పోటు సంభవించడానికి ఆస్కారం ఉందని పరిశోధనల్లో తేలిందని వైద్యులు చెప్తున్నారు.