శంషాబాద్ ఎయిర్పోర్టులో కరోనా అలర్ట్.. ప్రతి ప్రయాణికుడికి థర్మల్ స్క్రీనింగ్
చైనాలో మరణ మృదంగం మోగిస్తోన్న కరోనా ప్రభావం శంషాబాద్ విమానాశ్రయంపై పడింది. ప్రపంచాన్ని చుట్టేసిన కోవిడ్–19 హైదరాబాద్ను కూడా తాకడంతో శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రతి ప్రయాణికుడికి థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రయాణికులకు తప్పనిసరిగా పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాస్క్లు ధరించి ప్రయాణాలు చేస్తున్నారు. వివిధ దేశాల నుంచి వస్తున్న వారికి పూర్తి స్థాయిలో వైద్యపరీక్షలు నిర్వహించిన తర్వాతే బయటకు పంపుతున్నారు.
ప్రతిరోజు ఎయిర్పోర్ట్కి 8 వందల నుంచి 12 వందల మంది వరకు విదేశాల నుంచి భాగ్యనగరం చేరుకుంటున్నారు. దీంతో ప్రత్యేక వైద్య సిబ్బంది వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 17 మంది గ్రూప్గా షార్జా, దుబాయ్కి వెళ్లిన వారికి పరీక్షలు నిర్వహించారు. ఇక బ్యాంకాక్ నుంచి వస్తున్న ప్రయాణికులకు కూడా స్కినింగ్ టెస్టులు నిర్వహించడంతో పాటు పూర్తి సమాచారం తీసుకున్న తర్వాతే బయటకు అనుమతిస్తున్నారు. ధాయ్లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఎక్కువ నిఘాపెట్టారు. కెమెరాలతో పాటు అత్యాధునిక టెక్నాలజీ ఉన్న వైద్య పరికరాలతో టెస్టులు చేస్తున్నారు. ప్రయాణికులు విమానం దిగన వెంటనే ఒక ఫామ్ ద్వారా పూర్తి వివరాలను తీసుకుంటున్నారు. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే చెప్పాలని తెలిపారు.
కోవిడ్ 19 ఎఫెక్ట్తో నూతన ప్రయాణ మార్గదర్శకాలను విడుదల చేసింది భారత ప్రభుత్వం, ఇటలీ, ఇరాన్, జపాన్, సౌత్కొరియా దేశాల నుంచి వచ్చే వారికి వీసాలు రద్దు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇటలీ, చైనా. ఇరాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా దేశాలలో పర్యాటనలు చేయొద్దని సూచించింది. చైనా, సౌత్ కొరియా, ఇరాన్, ఇటలీ, హాంకాంగ్, మకావ్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, నేపాల్, థాయ్లాండ్, సింగపూర్, తైవాన్ దేశాల నుంచి వచ్చే వారికి మెడికల్ స్క్రినింగ్ నిర్వహించిన తర్వాతే దేశంలోకి అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.