తరాలు మారుతున్నా వివక్ష మాత్రం సమాజాన్ని వీడడం లేదు. కుల జాడ్యం వేళ్లూనుకుని ఉంది. తాజాగా నిర్మల్ జిల్లాలో కులం పేరుతో ఓ కుటుంబానికి అవమానం జరిగింది. స్థానిక కడం మండలం నవాబ్పేట్ గ్రామంలో బెస్త కులస్తులైన జ్యోతి-లచ్చన్న నివశిస్తున్నారు. అయితే లచ్చన్న ఉపాధి కోసం దుబాయ్కి వెళ్లాడు. ఈ క్రమంలో జ్యోతి చెల్లెలు ఎస్సి కులానికి చెందిన యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. ఇదిలా ఉంటే ఇటీవల వనభోజనాలకు వెళితే బెస్త కులస్తులు జ్యోతిని అవమానించారు. ఆ కుటుంబంతో ఎవరైనా మాట్లాడినా, సహాయం చేసినా 5వేల రూపాయల జరిమానా అని నిర్ణయించారు.
ఇక జరిమానా విషయంపై జ్యోతి గ్రామ పెద్దలను కలిసింది. తనకు న్యాయం చేయాలని కోరింది. దీంతో అందరూ కలిసి 30 వేల రూపాయల డబ్బులు కుల సంఘానికి కడితే తిరిగి జ్యోతి కుటుంబాన్ని కులంలోకి చేర్చుకుంటామని తీర్మానించారు. గత ఆరు నెలలుగా కులం పేరుతో దూషిస్తూ, బహిష్కరణకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేస్తుంది. చివరికి చేసేది లేక జ్యోతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.