గణతంత్ర వేడుకల్లో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి చేసిన ప్రసంగం ‘నవ్వులపాలు’ కావడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్పీ సింగ్ సీరియస్ అయ్యారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆమ్రపాలి తెలుగులో ప్రసంగిస్తూ మధ్య మధ్యలో నవ్వుతూ, వెనక్కి తిరిగి చూసుకోవడంతో నలుగురిలో నవ్వుల పాలైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న సర్కార్ వివరణ ఇవ్వాలని కోరింది. ఈ మేరకు సీఎస్ ఎస్పీ సింగ్ సోమవారం ఆమ్రపాలితో ఫోన్లో మాట్లాడారు. గణతంత్ర దినోత్సవ ప్రసంగం సమయంలో తడబాటుపై ఆరా తీశారు. కొన్ని పదాలు పలకడంలో ఇబ్బంది ఎదురైందని ఆమె సీఎస్కు వివరణ ఇచ్చినట్టు సమాచారం. కలెక్టర్ పదవిలో ఉండి హుందాగా వ్యవహరించాలని సీఎస్ .. ఆమ్రపాలికి సూచించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని ఆమ్రపాలికి సీఎస్కు చెప్పినట్లు తెలుస్తోంది.