నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ ఇంట్లో అగంతకుడు చొరబడడం కలకలం సృష్టించింది. 2 నెలల క్రితం ప్రణబ్ హత్యకు గురైన తర్వాత పెరుమాళ్ల బాలస్వామి కుటుంబానికి పోలీసులు భద్రత కల్పించారు. ప్రస్తుతం ప్రణయ్ కేసు విచారణ వేగంగా జరుగుతోంది. ఆదివారం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తుండగా శనివారం తెల్లవారు జామున దుండగుడు ఇంటి ఆవరణలో కలియతిరిగిన విషయాన్ని గుర్తించామని ప్రణయ్ తండ్రి బాలస్వామి తెలిపారు. ఆగంతకుడు ముఖానికి ముసుగు ధరించాడని, అదే సమయంలో అటుగా వచ్చిన పోలీసులను చూసి ఆగంతకుడు పారిపోయినట్లు చెప్పారు. బాలస్వామి పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితులైన తిరునగరు మారుతీరావు, ఎంఏ కరీం, శ్రావణ్కుమార్పై మూడు రోజుల కిందటే పోలీసులు పీడీయాక్ట్ను ప్రయోగించారు.