తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కాలేజీలు సత్తా చాటాయి. ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలకు ధీటైన సమాధానమిచ్చాయి. లక్షల్లో ఫీజులు వసూలుచేస్తూ విద్యార్ధులను రాచిరంపాన పెట్టే కార్పొరేట్ కాలేజీల కంటే ఎన్నో రెట్లు మెరుగైన ఫలితాలు సాధించాయి. టాప్-5 కాలేజీల్లో మొదటి నాలుగూ గవర్నమెంట్ కళాశాలలే ఉండగా, కార్పొరేట్ విద్యాసంస్థలు ఐదో స్థానంలో నిలిచాయి. మార్కుల్లోనూ ఓవరాల్ పర్సంటేజీల్లోనూ కార్పొరేట్ కాలేజీల కంటే ప్రభుత్వ కళాశాల విద్యార్ధులే మెరుగైన ప్రతిభ చాటారు.
ప్రభుత్వరంగ విద్యాలయాల దెబ్బకు కార్పొరేట్ కాలేజీలు చివరి స్థానంతో సరిపెట్టుకున్నాయి. మొత్తం 87శాతం పాస్ పర్సంటేజ్తో ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీలు టాప్లో నిలవగా 86శాతం ఉత్తీర్ణతతో సోషల్ వెల్ఫేర్ కళాశాలలు రెండో స్థానాన్ని దక్కించుకున్నాయి. ఇక తెలంగాణ రెసిడెన్షియల్ కాలేజీలు 81శాతం పాస్ పర్సంటేజ్తో మూడో స్థానంలో నిలిచాయి. అలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 70శాతం ఉత్తీర్ణతతో నాలుగో స్థానంలో నిలిచి సత్తా చాటాయి. కేవలం 69శాతం ఉత్తీర్ణతతో కార్పొరేట్ కాలేజీలు చివరి స్థానంలో నిలిచాయి. ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వరంగ విద్యాలయాలు సాధించిన ఫలితాలతోనైనా తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు రావాలన్నారు మంత్రి కడియం శ్రీహరి. కనీస వసతులు కూడా లేని ప్రైవేట్ కాలేజీలకు పంపి పిల్లలపై ఒత్తిడి పెంచొద్దని సూచించారు.