నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలే ఓ వ్యక్తిని నరికేశారు. ఇద్దరు అమ్మాయిలతో కలిసి వెళ్తున్న పెరుమాళ్ల ప్రణయ్ అనే వ్యక్తిని కత్తి చేతపట్టుకుని వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి అటాక్ చేశాడు. తొలి వేటుకు ప్రణయ్ కిందపడిపోగా రెండో వేటుకు ప్రణయ్ తలపగిలిపోయింది. దీంతో ప్రణయ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఇటు ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్కు గురైన ప్రణయ్తో వచ్చిన అమ్మాయిలు అరుపులు కేకలతో పరుగులు పెట్టారు.
మృతుడు ప్రణయ్ ఆరు నెలల క్రితం అమృత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అయితే అమృత తల్లిదండ్రులకు ఈ వివాహం ఇష్టం లేకపోవడంతో వీరిద్దరూ కలిసి హైదరాబాద్కు వెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నారు. పట్టణంలో పేరుమోసిన రియల్టర్ కుమార్తె కావడంతో తొలుత ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానించారు. ప్రెగ్నెన్సీతో ఉన్న తన భార్యను అక్కడి జ్యోతి హాస్పిటల్లో చూపించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
అయితే విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రంగనాథ్ ఘటనా స్థలిని పరిశీలించారు. హత్యకు వాడిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే హత్య జరిగిందని దీని వెనుక రియల్టర్, అమృత తండ్రి అయిన మారుతిరావే ఉన్నారని స్పష్టం చేశారు. కూతురు ప్రేమ వివాహం ఇష్టం లేని మారుతిరావు ప్రణయ్ హత్యకు ప్లాన్ చేసినట్లు ఆరోపణలున్నాయని ఎస్పీ వివరించారు. ఈ కేసులో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.