ప్రేమ రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. కలిసి బతకలేమనుకొన్న జంట ఆత్మహత్య చేసుకున్నారు. క్షణికావేశంలో కన్నవారి ఆశలను కలలు చేసి తనువు చాలించుకున్నారు. ఆనందాన్ని పంచాల్సిన పిల్లలు విషాదాన్ని నింపి తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ విషాద ఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగింది.
భరత్ , షేక్ నజీమా గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. కులాలు వేరుకావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోరన్న మనోవేదనతో రెండ్రోజుల క్రితం కంప్యూటర్ ఇనిస్టిట్యూట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీనిని గమనించిన తోటి విద్యార్ధులు వెంటనే ప్రేమికులను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రేమ జంట మృతి చెందింది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో ఇద్దరి కుటుంబాల్లో విషాదం నెలకొంది.