షోకాజ్ నోటీసులు జారీ చేసినా కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటి రాజగోపాల్ రెడ్డి వెనక్కు తగ్గలేదు. అన్ని ఆలోచించే మాట్లాడానంటూ ప్రకటించిన ఆయన తన వ్యాఖ్యలను పాజిటీవ్గా తీసుకోవాలంటూ అధిష్టానానికి సూచించారు. ఇదే సమయంలో టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పించారు. ఒకే కుటుంబానికి చెందిన నేతలు వేర్వేరు పార్టీలో ఉంటారంటూ వ్యాఖ్యానించి కొత్త ఊహాగానాలకు తెరలేపారు.
పీసీసీ కమిటీలతో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ కుంతియాపై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమర్ధించుకున్నారు. ఏ ఒక్కరిని వ్యక్తిగతంగా దూషించలేదన్న ఆయన కమిటీల ఏర్పాటుపైనే ఆరోపణలు చేశానన్నారు. కార్యకర్తల మనోగతాన్నే తాను వెల్లడించానంటూ సమర్ధించుకున్నారు. 2014లో ఇలాంటి తప్పిదాల వల్లే అధికారానికి దూరమయ్యామని మరోసారి ఇలాగే చేస్తే పరాజయం తప్పదన్నారు. పార్టీలో తనకు ఎలాంటి పదవులు అవసరం లేదన్న ఆయన సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వాదాన్ని వినిపించిన చరిత్ర కోమటిరెడ్డి బ్రదర్స్దేనన్నారు.
ఓ వైపు తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటూనే మరోసారి టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా విమర్శలు గుప్పించారు. నల్లగొండ పార్లమెంట్ పరిధిలోని తన వర్గం వారికి నామమాత్రంగా కూడా చోటు దక్కలేదన్నారు. ఉత్తమ్ తీరు వల్లే ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోలేకపోతున్నామన్నారు. పార్టీలోని ఎవరిపై తనకు అసంతృప్తి లేదన్న రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని తానే పార్టీలోకి తెచ్చామన్నారు. ఇదే సమయంలో పార్టీ మార్పుపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. చాలా కుటుంబాల్లోని సభ్యులు వేర్వేరు పార్టీలో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. దీంతో పాటు తనను కాంగ్రెస్ నుంచి పంపితే పార్టీకి నష్టమన్నారు .
షోకాజ్ నోటీసుల వ్యవహరాన్ని లైట్గా తీసుకున్న రాజగోపాల్ రెడ్డి తన వివరణ ఇచ్చేందుకు రెండు రోజులు అవసరం లేదని .. రెండు గంటలు చాలంటూ ప్రకటించారు. తన వాదన వినిపిస్తూ నోటీసులకు సమాధానమిస్తానన్న ఆయన ... ఉత్తమ్పై బహిరంగ విమర్శలు చేసి కొత్త వివాదాన్ని రగిల్చారు.