గ్రామపంచాయతీల్లో మొక్కలు పెంచని సర్పంచ్లను తొలగిస్తామని, అలాగే నాటిన మొక్కల్లో 85శాతం బతకకపోతే గ్రామ కార్యదర్శిని కూడా తొలగిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీ సీఎం మాట్లాడుతూ... రాష్ట్రంలో 250 కోట్ల మొక్కలు నాటాలనేది ప్రభుత్వ సంకల్పమన్నారు. మెదక్ జిల్లాలో అడవుల పునరుద్ధరణ చూసి ప్రధాని ప్రశంసించారని, సమైక్య పాలనలో ఏడాదిలో 50 లక్షల మొక్కలు కూడా నాటలేదన్నారు. కాగా... ప్రతి ఏటా గ్రామ పంచాయతీలకు బడ్జెట్లో రూ.1500 కోట్ల కేటాయిస్తామని, అంతేగాక ఏటా బడ్జెట్లో మున్సిపాలిటీలకు రూ.1000 కోట్లు కేటాయిస్తామన్నారు.
3 నెలల్లో గ్రామాల్లో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటుందని తెలిపారు. ఎన్ని కేసులు వేసినా ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామన్నారు. సంఘటిత శక్తి లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని, రైతులను సంఘటితం చేసేందుకే రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. గిట్టుబాటు ధర, పంటల విక్రయం సమస్యల పరిష్కారానికే సమితులు అని వెల్లడించారు. బయోమెట్రిక్తో ఎరువులు కొనాలంటే రైతులు ఇబ్బంది పడుతున్నారని, అందుకోసమే రూ.300 కోట్లతో రైతు వేదికలు నిర్మిస్తున్నామని కేసీఆర్ తెలిపారు.