హైదరాబాద్ లో భారీగా బోగస్ ఓట్లు బయటపడ్డాయి. ఒకే ఇంట్లో 183 నకిలీ ఓట్లు ఉన్నాయి. ఆ ఇంట్లో కేవలం ఒకే ఒక వృద్ధురాలు వుంటుంది. కానీ , ఆ ఇంటి పేరిట 183 బోగస్ ఓట్లు ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని బీజేపీ నేతలు బయటపెట్టారు.
లంగర్ హౌజ్ పరిధిలోని బాపు నగర్ లోని ఓ ఇంట్లో భారతమ్మ అనే వృద్ధురాలు అద్దెకు ఉంటుంది. ఈమె గత ఏడాదిన్నర నుంచి ఈ ఇంట్లో నివసిస్తుంది. ఈ ఇల్లు బూత్ నెంబర్ 141 పరిధిలోకి వస్తుంది. ఈ ఇంటి పేరిట ఏకంగా 183 ఓట్లు వుండడం చూసి బీజేపీ బూత్ ఇన్ ఛార్జ్ లు ఖంగుతిన్నారు. ఆ ఇంట్లో భారతమ్మ తప్ప ఇతరులెవరూ కనిపించకపోవడంతో ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.
బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ రవి, జీహెచ్ ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుభాన్స్ తో కలిసి 183 ఓట్లున్న ఇంటిని పరిశీలించారు. ఆ ఇంట్లో నివాసం ఉంటున్న భారతమ్మతో పాటు చుట్టుపక్కలవారితో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. ఒకే ఇంట్లో 183 ఓట్లు వుండడం విషయంపై విచారణ జరిపిస్తామన్నారు అధికారులు. ఇవి బోగస్ ఓట్లుగా అనుమానం వ్యక్తం చేశారు.