యాదాద్రి జిల్లాలో చిన్నారుల అక్రమ రవాణా వెలుగు చూసింది. రాచకొండ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్లో 11 మంది చిన్నారులను కాపాడారు. అంతా ఐదు నుంచి ఎనిమిదేళ్ల వయస్సు ఆడపిల్లలు. బాధిత చిన్నారులను రెస్క్యూ హోమ్కు తరలించారు.
యాదగిరిగుట్టలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్న కంసాని కల్యాణికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. కంసాని కల్యాణి అనే మహిళ ఇలా కొనుగోలు చేసిన బాలికను చిత్రహింసలు పెడుతుండడంతో స్థానికులు షీ టీం, ఐసీడీఎస్, చైల్డ్లైన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఐసీడీఎస్, రాచకొండ పోలీసుల తనిఖీల్లో చిన్నారుల అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది.
ఆపరేషన్ ముస్కాన్లో పట్టుబడిన వారంతా ఐదు నుంచి ఎనిమిదేళ్ల వయస్సు ఆడపిల్లలే. మొదట ఇంటి పని కోసం తీసుకొచ్చి ఆ తర్వాత వ్యభిచార రొంపిలోకి దింపేందుకు కొందరు కొనుగోలు చేశారు. మొదట బాగానే చూసుకుంటున్నా ఆ తర్వాత చిత్రహింసలు పెడుతున్నారు.
శంకర్ అనే వ్యక్తి బాలికను తనకు అమ్మినట్లు కంసాని కల్యాణి చెబుతోంది. ఇంకొంత మంది చిన్నారులను కూడా శంకర్ స్థానిక గణేష్ నగర్లో ఉండే కంసాని సుధలక్ష్మీ, శోభ, కంసాని కృష్ణ, కుమారి, మానసలకు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడించింది. అసలు బాలికల రవాణా ఎప్పుటినుంచి జరుగుతుంది ఎవరు సూత్రధారులు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.