రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుకుంటా: కేటీఆర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరితో ఫుట్బాల్ ఆడుకుంటాడో తనకు తెలియదని, తాను మాత్రం రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరితో ఫుట్బాల్ ఆడుకుంటాడో తనకు తెలియదని, తాను మాత్రం రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఈరోజు మీడియాతో కేటీఆర్ చిట్చాట్ నిర్వహించారు. రేవంత్ ఇంట్లో మహిళలు, పిల్లలు, మనమడి గురించి తానుమాట్లాడనని, కుటుంబ సభ్యుల విషయంలో చిల్లర రాజకీయాలు చేయనని చెప్పారు. కేసీఆర్ రేపు అన్ని విషయాలపై దిశానిర్దేశం చేస్తారన్నారు.
రేవంత్ రెడ్డి సర్కార్కి హనీమూన్ ముగిసిందని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని, కేసీఆర్ బహిరంగ సభలపై రేపటి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ ఆఫీస్లో ప్రెస్మీట్ పెట్టి బీఆర్ఎస్లోనే ఉన్నామనటం పెద్ద కామెడీ అన్నారు. రేవంత్ చెప్పే 66 శాతం నిజమైతే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి బైపోల్స్కు రావాలని సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ గా తాను ఫెయిల్ కాలేదని, తాను వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక 32 జిల్లా పరిషత్ లు, 136 మున్సిపాలిటీలు గెలిచినట్లు చెప్పారు. రేవంత్ సీఎం అయ్యాక.. సొంత పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలిపించుకోలేదని, తాను ఐరన్ లెగ్ కాదు, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలే ఐరన్ లెగ్లు అని విమర్శించారు.
పంచాయతీ ఎన్నికల దెబ్బకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించరన్నారు. మొదట మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారని చెప్పారు. గ్రేటర్లో మున్సిపాలిటీల విలీనం సక్రమంగా జరగలేదని, జీహెచ్ఎంసీని మూడు కార్పోరేషన్లు చేయాలనేది రేవంత్ రెడ్డి ఆలోచనగా ఉందన్నారు. అయితే, గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు పెట్టాలనే దానిపై కూడా సీఎంకు స్పష్టత లేదని విమర్శించారు. 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు.