ఆపద్ధర్మ సీఎం కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రజా యుద్ధనౌక గద్దర్ స్ఫష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ తాను ఏ పార్టీకి మద్దతు దారుడిని కాదని, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను కలవడం వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. వారితో జరిగిన సమావేశంలో 45 నిమిషాలూ పాట పాడి వినిపించానని, అంతే కాకుండా రాహుల్కు ‘సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ డెమొక్రసీ’ గురించి వివరించానని అన్నారు. ఢిల్లీలో సీఐడీ అడిషినల్ డీజీని కలిసి తనకు రక్షణ కల్పించాలని కోరానని, సీఈఓకు కూడా వినతిపత్రం సమర్పించానని వెల్లడించారు.
ఎప్పుడైనా ఫ్యూడలిస్టులు - ఇంపీరియలిస్టులు అనే రెండు వర్గాల మధ్యలోనే ఎన్నికల లొల్లీ ఉంటుదని గద్దర్ అన్నారు. ఒక ఓటు రాష్ట్ర రాజకీయ నిర్మాణ రూపం కాబట్టి ప్రతిఒక్కరు ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు గద్దర్ సూచించారు. ప్రచారంలో భాగంగా మొదటి దశలో ఎస్టీ నియోజకవర్గ పరిధిలో ఓటుపై చైతన్యం. రెండో దశలో ఎస్సీ నియోజకవర్గ పరిధిలో, 3వ దశలో బీసీలు, 4వ దశలో నీరు పేదల దగ్గరకు వెళ్తానని తెలిపారు.