తెలంగాణ కోసం పోరాటం చేసిన ఉద్యమకారులకు సీఎం కేసీఆర్ బాసటగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఎస్సీ-ఎస్టీ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ చైర్మన్ గా సిద్దిపేట చిన్నకోడూరు మండలం గణపూర్ కు చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్ ను నియమించారు. ఇతర సభ్యుల నియామకాలకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదిలా ఉంటే ఎర్రోళ్ల తెలంగాణ రాష్ట్రసాధనలో భాగంగా కేసీఆర్ తలపెట్టిన మలిదశ ఉద్యమంలో విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేశారు. అలా టీఆర్ఎస్వీకి తొలి అధ్యక్షుడి, టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా పనిచేశారు. 2003లో ఓయూ ఆర్ట్స్ కళాశాల టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా, 2004లో జంటనగరాల టీఆర్ఎస్వీ విభాగం ప్రధాన కార్యదర్శిగా, 2005-07 వరకు టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2007-2010 వరకు టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ ను ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్గా నియమిస్తూ కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. కమిషన్ ఛైర్మన్ నియమించడంపై ఎర్రోళ్ల ఆనందం వ్యక్తం చేశారు. ఉద్యమం సమయంలో తనని ప్రోత్సహించిన కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ , కవితలకు రుణపడి ఉంటానని అన్నారు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి సిద్దిపేట నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ తనకు ఆదర్శమని వెల్లడించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, వారి ప్రగతికోసం కమిషన్ తరఫున కృషి చేస్తూ కేసీఆర్ బాటలో తాను పనిచేస్తానని వివరించారు