తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సమయం దగ్గర పడటంతో ఈసీ స్పీడ్ పెంచింది. ఓటరు నమోదు కార్యక్రమం పూర్తికావడంతో నెక్ట్స్ ఏంటన్నదానిపై దృష్టిపెట్టింది. ఎన్నికల నిర్వహణ కోసం వివిధ జిల్లాలకు చేరుకున్న వీవీ ఫ్యాట్స్, ఈవీఎంలకు కొత్తగా అమర్చిన టెక్నాలజీపై అవగాహన కల్పించే పని ప్రారంభించారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్లో ఈవీఎంల పనితీరుపై రాజకీయ పార్టీల నేతలకు అవగాహన కల్పించారు అధికారులు.
రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు తేదీలు ఖరారైనట్టు తెలుస్తోంది. వచ్చే నెల 8వ తేదీ సాయంత్రం లేదా 12వ తేదీన మధ్యప్రదేశ్, మిజోరాం, చత్తీస్గడ్, రాజస్థాన్తోపాటు తెలంగాణ రాష్ట్రానికి కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు జిల్లాల వారీగా తమ పనిని మరింత వేగవంతం చేశారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఈవీఎంలు, వీవీ ఫ్యాట్స్ భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్స్ లాంటి వాటిపై నివేదికలు రప్పిస్తున్నారు. బూత్ల వారీగా సేకరించిన సమాచారంతో ఈసీ రజత్కుమార్ జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తి కావడంతో ఆ సిబ్బందికి మరో బాధ్యతను అప్పగించారు అధికారులు. త్వరలోనే క్షేత్ర స్థాయి పర్యటనకు ఈసీ బృందం రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉండటంతో సమాచార వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి చేరిన వీవీ ఫ్యాట్స్, ఈవీఎంలపై అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్లో రాజకీయ పార్టీల నేతల సమక్షంలో వాటిని పరిశీలించారు.
కొత్తగా ఈఆర్వో విధానం అనుసంధానం చేసిన ఈసీ.. ఈవీఎం, వీవీ ఫ్యాట్స్ తనిఖీలను సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ద్వారా నిఘా పెట్టే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే, గట్టి బందోబస్తుతోపాటు పోలింగ్కు హాజరయ్యే సిబ్బంది, అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు జారీ నుంది ఈసీ.