వనపర్తి సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత డీకే అరుణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ బెదిరింపులకు భయపడేదిలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు. పాలమూరు జిల్లాకు నీరు ఇచ్చామని చెప్పుకునేందుకు సిగ్గు ఉండాలని విమర్శించారు. కేసీఆర్ ఎంత మోసగాడో ప్రజలకు తెలిసిపోయిందన్నారు. కేసీఆర్ సంస్కారంతో మాట్లాడటం నేర్చుకోవాలని హితవుపలికారు.
పాలమూరు జిల్లాకు కేసీఆర్ ఏం ఒరగబెట్టారని అరుణ ప్రశ్నించారు. ఓ శక్తి గురించి మాట్లాడుతున్నావని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. తాను రుఘువీరారెడ్డికి మంగళహారతి పట్టినట్టు ఫొటోలు, వీడియోలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మాటల్లో ఒటమి భయం కనిపిస్తోందని తెలిపారు. బ్రోకర్గా దుబాయ్కి మనుషుల్ని అమ్మిన చరిత్ర కేసీఆర్దని వ్యాఖ్యానించారు. దుబాయ్ శేఖర్గా పేరు పొందావని గుర్తుచేశారు.
నాలుగున్నరేళ్లలో తన బండారం ఎందుకు బయటపెట్టలేకపోయావని ప్రశ్నించిన డీకే అరుణ తన గురించి గద్వాల ప్రజలకు తెలుసన్నారు. కేసీఆర్వి ముఖ్యమంత్రి స్థాయి మాటలేనా అని నిలదీశారు. తెలంగాణలో పుట్టిన కేసీఆర్కు ఇంత నీచ సంస్కృతి ఎలా వచ్చిందన్నారు. టీఆర్ఎస్ తెలంగాణ రాబందులు, రాక్షసుల పార్టీ అని అరుణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఏముందని నిలదీశారు. కాంగ్రెస్ లేకపోతే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. నిమ్స్ ఆస్పత్రికి వెళితే కేసీఆర్ దీక్ష సంగతేంటో తెలుస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైనవారి కుటుంబాలకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.