లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్యసభ సభ్యుడు డీఎస్ తనయుడు సంజయ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజులు పరారీలో ఉన్న సంజయ్ నిన్న తన లాయర్తో పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. నేడు ఎస్సీ, కోర్టులో సంజయ్ని హాజరుపరచనున్నారు నిజామాబాద్ పోలీసులు.
శాంకరీ నర్సింగ్ కాలేజీ విద్యార్థినిలపై లైంగిక వేధింపుల కేసులో నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై నిర్భయ కేసు నమోదైనప్పటి నుంచి ఇంటికి తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. సంజయ్ ఆచూకీ కోసం పోలీసులు 4 బృందాలుగా విడిపోయి హైదరాబాద్, మహారాష్ట్ర, విజయవాడలో తీవ్రంగా గాలించారు. అయినా అతను దొరకలేదు. చివరికి సంజయ్ తన లాయర్తో పోలీసుల ఎదుట విచారణ హాజరవడంతో అరెస్ట్ చేశారు. తర్వాత మెడికల్ టెస్టుల కోసం అతడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి అడిషనల్ జడ్జ్ ఎదుట హాజరుపరిచారు. సంజయ్ని రిమాండ్కు పంపించాలన్న పోలీసుల ప్రతిపాదనను న్యాయమూర్తి తిరస్కరించారు. సోమవారం ఎస్సీ, ఎస్టీ కోర్టులో సంజయ్ని హాజరుపరచాలని ఆదేశించారు.
ఇదిలా ఉంటే అజ్ఞాతంలో ఉండగానే సంజయ్ తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై హైకోర్టును ఆశ్రయించారు. తన అరెస్టుపై స్టే ఇవ్వాలని క్వాష్ పిటిషన్ వేశారు. కానీ దానిని తిరస్కరించి కోర్టు సంజయ్కి షాకిచ్చింది. దీంతో సంజయ్ ఇరకాటంలో పడ్డారు. సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నారని చెప్పుకోలేని విధంగా దూషించాడని నిజామాబాద్ శాంకరీ నర్సింగ్ కాలేజీకి చెందిన కొందరు విద్యార్థినిలు హోంమంత్రి నాయినిని నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో సంజయ్పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. అప్పట్నుంచి ఇంటికి తాళం వేసి సంజయ్ వారం పాటు పరారీలో ఉన్నాడు. అజ్ఞాతం వీడి బయటకు రాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు సంజయ్ ఇంటికి నోటీసులు అంటించారు. దీంతో సంజయ్కి ఏమీ తోచలేదు. చివరికి తన లాయర్ను వెంటబెట్టుకొని.. పోలీసుల ముందు విచారణకు హాజరయ్యాడు. వారం రోజుల డ్రామా తర్వాత.. సంజయ్ అరెస్ట్ అయ్యాడు.