తెలంగాణలో మహాకూటమికి బీటలు వచ్చే అవకాశం ఉందా..? అసంతృప్తితో ఉన్న సీపీఐ కూటమికి గుడ్బై చెప్పనుందా..? తాజా రాజకీయ పరిణామాలను చూస్తుంటే అది నిజమేననిపిస్తోంది. తాము కచ్చితంగా చెప్పిన తర్వాత కూడా 3 సీట్లే కేటాయించడంపై సీపీఐ నేతలు మండిపడుతున్నారు. కనీసం ఐదు స్థానాలైనా కేటాయిస్తారని భావించినట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ తీరుపై మండిపడుతున్న సీపీఐ నేతలు కూటమిలో ఉండాలా? వద్దా? అన్నదానిపై ఇవాళ రాష్ట్ర పార్టీ కార్యవర్గ అత్యవసర సమావేశంలో తేల్చేయబోతున్నారు.
ఢిల్లీలో మూడు రోజుల సుదీర్ఘ కసరత్తు తర్వాత 74 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ తొలిజాబితాను ఖరారు చేసింది. కూటమిలో భాగస్వామ్య పార్టీలైన టీడీపీకి 14, టీజేఎస్కు 8, సీపీఐకి 3, తెలంగాణ ఇంటి పార్టీకి 1 చొప్పున మొత్తం 26 సీట్లు కేటాయించింది. దీంతో సీపీఐ నేతలు తాము కచ్చితంగా చెప్పిన తర్వాత కూడా 3 సీట్లే కేటాయించడంపై మండిపడుతున్నారు.
సీపీఐకి హుస్నాబాద్, బెల్లంపల్లి, వైరా స్థానాలను కాంగ్రెస్ కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే తమకు బలమున్న కొత్తగూడెం సీటును కూడా ఇవ్వాలని సీపీఐ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే, మహాకూటమి గురించి మొట్టమొదట ప్రతిపాదన చేసిన పార్టీ భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇదంతా చూస్తుంటే కూటమికి సీపీఐ గుడ్బై చెప్పడం ఖాయమనిపిస్తోంది.