తెలంగాణలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. ప్రధాన పార్టీలన్నీ ప్రజాక్షేత్రంలో ప్రచార సభలతో హోరెత్తిస్తున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతుండగా బీజేపీ కూడా దూకుడు పెంచింది. ఎన్నికల కోసం యువతలో చైత్యన్యం నింపేందుకు.. యువ సమ్మేళనం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో విజయ్ లక్ష్య్ 2019 పేరిట యువ మహాసభలకు సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్ సర్వం సిద్ధమైంది. పరేడ్ గ్రౌండ్లో దక్షిణాదిన తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ సభలకు దేశవ్యాప్తంగా 2లక్షల మంది హాజరుకానున్నారు. ఇప్పటికే బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనం మహాజన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేఎల్పీ మాజీ నేత జి.కిషన్రెడ్డి ఏర్పాట్లు సమీక్షించారు.
మరికాసేపట్లో ప్రారంభమయ్యే సభకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ముగింపు సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భారీ బహిరంగ సభకు హాజరవుతారు. ఈ సభలో 10 మంది కేంద్ర మంత్రులు, 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు. ఈ సభ రాబోయే ఎన్నికలకు యుద్ధభేరి మోగిస్తుందని, రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు దోహదపడుతుందంటున్నారు పార్టీ నేతలు.