ఆందోల్ తాజా మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్. సంగారెడ్డిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. 25 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా బ్రతికానని, ఎన్నిసార్లు ఫోన్ చేసినా... ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించలేదంటూ వాపోయారు. తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చిన కేసీఆర్... ఇప్పుడు నడి రోడ్డుపైన వదిలేశారని అన్నారు. తన సేవలను బీజేపీ గుర్తించిందని, అందుకే ఆ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు బాబూ మోహన్. తప్పు చేస్తే క్షమించాలని, ఎప్పటికైనా కేసీఆరే తన గాడ్ఫాదర్ అని తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్ ఓ బ్రోకర్ అని, స్థానిక అభ్యర్థి కాదని ఆరోపించారు. గతంలో సిరిసిల్లలో నిర్వహించిన ప్రచారంలో కేటీఆర్ను క్రాంతి కిరణ్ తిట్టిన విషయాన్ని గుర్తు చేశారు. 25 ఏళ్లుగా ఆందోల్లో గెలుస్తూ వచ్చానని, తాను వంద శాతం స్థానిక అభ్యర్థినని స్పష్టం చేశారు.