తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ట్విట్టర్లో గంటపాటు సాగిన ముఖాముఖిలో అనేక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనపై నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చారు. ముఖ్యంగా మహా కూటమిపై విరుచుకుపడ్డ కేటీఆర్ ప్రస్తుత రాజకీయాలు దిగజారిపోయాయంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
ట్విట్టర్లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన మంత్రి కేటీఆర్ విపక్షాలపై విరుచుకుపడ్డారు. వందల మంది తెలంగాణ ప్రజల ప్రాణాలు బలిగొన్న పార్టీలన్నీ జట్టు కట్టాయంటూ మండిపడ్డారు. ప్రస్తుత రాజకీయాలు ఎన్నడూలేనంత స్థాయికి దిగజారాయని ఆవేదన వ్యక్తంచేశారు. కనీస విలువలు, మర్యాద, సంస్కారం పాటించడం లేదన్నారు. తాము చేసిన అభివృద్ధిని తెలంగాణ ప్రజల ముందు పెట్టామన్న కేటీఆర్ ఇక నిర్ణయం తీసుకోవాల్సింది ఓటర్లేనన్నారు. ఢిల్లీలో రైతులపై లాఠీఛార్జ్ను ఖండించిన కేటీఆర్ రైతాంగానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. అలాగే పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించి లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు.
హైదరాబాద్ అభివృద్ధిపై పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు. పెద్దఎత్తున రోడ్ల విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్న కేటీఆర్ మళ్లీ అధికారం చేపట్టాక మరిన్ని మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెడతామన్నారు. హైదరాబాద్తోపాటు రాష్ట్రంలో మిగతా అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్నదే తమ లక్ష్యమన్నారు.