మా డాడీ కనిపిస్తే నేనే చంపేస్తా : అమృత

Update: 2018-09-17 06:01 GMT

ప్రణయ్ హత్య కేసులో నిందితులను పోలీసులు ఇవాళ మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రణయ్ భార్య అమృత డిమాండ్ చేస్తుంది. క్యాస్టిజం మీద పోరాటం సాగిస్తానని, అందరూ తనకు మద్దతునివ్వాలని అమృత కోరుతోంది. మా డాడీ కనిపిస్తే నేనే చంపేస్తానని చెబుతోంది అమృత. పోలీసులు మొదటి నుంచి తమకు సపోర్టు చేశారని, 10, 11 రోజుల్లో ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆమె చెప్పారు. 

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన ప్రణ‍య్ హత్య కేసు దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగుచేస్తున్నాయి. కన్న ప్రేమను సైతం పక్కన బెట్టి అత్యంత పాశవికంగా ప్రవర్తించిన మారుతి రావు అసలు స్వరూపం నెమ్మదిగా వెలుగు చూస్తోంది.  ప్రణయ్ హత్య చేసేందుకు మారుతి రావు పకడ్బందీ ప్లాన్ వేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. హత్య వెనక నయీం గ్యాంగ్ హస్తముందని అమృత ఆరోపించినట్టుగానే  హత్యకు పాల్పడిన నిందితుల్లో నయిం గ్యాంగ్ సభ్యుడిని పోలీసులు గుర్తించారు. 

గతంలో నయీంకు ముఖ్య అనుచరుడిగా ఉన్న  అబ్దుల్  బారీ ఈ హత్యకు పథక రచన చేసినట్టు పోలీసులు గుర్తించారు. పూర్తి స్ధాయిలో రెక్కి నిర్వహించిన తర్వాత 20 రోజుల క్రితం డీల్ కుదిరినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.  ప్రణయ్‌ని హత్య చేసేందుకు 15 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకున్నారు.  ఈ డబ్బుతోనే షఫీ అనే రౌడీషీటర్‌తో ఒప్పందం కుదుర్చుకుని హత్య చేసినట్టు గుర్తించారు. నయీం ఎన్‌కౌంటర్ అనంతరం హైదరాబాద్ మకాం మార్చిన అబ్దుల్ బారీదే ఇక్కడి నుంచే హత్యకు కుట్ర చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. గతంలో  ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన గుజరాత్ హోంమంత్రి  హిరేన్  పాండే  కేసులో అబ్దుల్ బారీ జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చారు. దీంతో అమృత తండ్రి మారుతీరావుకు ఉగ్రవాదులతో కూడా సంబంధాలు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.  

పరువు హత్యలను అత్యంత అరుదైన కేసులుగా పరిగణించాలని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. అత్యంత హేయమైన, అనాగరికమైన ఈ చర్యలను సమూలంగా నిర్మూలించాలని పేర్కొంది. పరువు హత్యలను అత్యంత అరుదైన కేసులుగా పరిగణించాలని, ఇలాంటి కేసుల్లో దోషులకు ఉరిశిక్ష వేయాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.  ఢిల్లీకి చెందిన భగవాన్‌దాస్‌ తన కుమార్తె తన ఇష్టానికి వ్యతిరేకంగా మేనమామ కొడుకును పెళ్లి చేసుకొని పరువు తీసిందన్న కోపంతో ఆమెను హతమార్చాడు. ఆ కేసును విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు పరువు హత్యలపై కీలక వ్యాఖ్యలు చేసింది.  హింసాత్మక చర్యలకు పాల్పడకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అన్ని విచారణ కోర్టులు, హైకోర్టులు పరువు హత్యలను అత్యంత అరుదైన కేసులుగానే పరిగణించాలని, దోషులకు ఉరిశిక్ష విధించాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు దేశంలోని అన్ని కోర్టులకు ఉత్తర్వులిచ్చింది.

Similar News