ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందామంటూ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ చేపట్టిన విద్యా విజ్ఞానయాత్రలో సైఫాబాద్ ఏసీపీ ఓవరాక్షన్ చేశారు. ఆందోళనలో పాల్గొన్న వారి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఓ విద్యార్థినిపై ఏసీపీ వేణుగోపాల్ చేయి వేసి తోసేశాడు. హెచ్ఎంటీవీలో ప్రసారమైన దృశ్యాలను పరిశీలించిన డీజీపీ ఏసీపీ వేణుగోపాల్ ప్రవర్తన పట్ల సీరియస్ అయ్యారు. విద్యార్థిని పట్ల దురుసుగా ప్రవర్తించిన ఏసీపీపై చర్యలకు సిద్ధమయ్యారు. సేవ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో గన్పార్క్ వద్ద నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రొఫెసర్ హరగోపాల్ పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ఆయనను బలవంతం ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన పోలీసులు బొల్లారం పోలీస్స్టేషన్కు తరలించారు.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను కాపాడుకుందాం అనే నినాదంతో తెలంగాణ విద్యా పోరాట, పరిరక్షణ కమిటి వందరోజుల విద్యా పోరాట యాత్రను ప్రారంభించింది. గన్పార్క్ అమరవీరుల స్థూపం నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, మహిళా, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. విద్య పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ 31 జిల్లాలో ఈ యాత్ర కొనసాగనుంది. అయితే, గన్పార్క్ వద్ద నివాళులర్పించి బయలుదేరుతున్న ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీలో పాల్గొన్న ప్రొఫెసర్ హరగోపాల్, చుక్కా రామయ్య పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు విమర్శలకు దారితీస్తోంది.