KTR: ప్రజా పాలన కాదు.. పక్కా మాఫియా పాలన
KTR: తెలంగాణలో ప్రస్తుతం నడుస్తోంది ప్రజా ప్రభుత్వం కాదని, అది పక్కాగా 'మాఫియా' పాలన అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ధ్వజమెత్తారు.
KTR: ప్రజా పాలన కాదు.. పక్కా మాఫియా పాలన
KTR: తెలంగాణలో ప్రస్తుతం నడుస్తోంది ప్రజా ప్రభుత్వం కాదని, అది పక్కాగా 'మాఫియా' పాలన అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆగడాలు మితిమీరిపోయాయని, అధికారుల అండదండలతోనే ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ఆయన ఆరోపించారు.
పెద్దపల్లి జిల్లాలోని తనుగుల చెక్ డ్యామ్ను ఇసుక మాఫియా పేల్చివేసిన ఉదంతంపై కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. "వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా" రాజేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, ఉద్దేశపూర్వకంగా చేసిన 'మానవ నిర్మిత విధ్వంసం' అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇసుకను అక్రమంగా తరలించడానికి అడ్డుగా ఉన్నాయనే కారణంతో, కోట్ల రూపాయలతో నిర్మించిన చెక్ డ్యామ్లను డ్రిల్లింగ్ మెషీన్లతో రంధ్రాలు చేసి, జిలెటిన్ స్టిక్స్ పెట్టి మరీ పేల్చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నికల లబ్ధి కోసం కాళేశ్వరం ప్రాజెక్టుపై బాంబులు వేశారని, ఇప్పుడు ఇసుక కాంట్రాక్టర్ల లాభాల కోసం చెక్ డ్యామ్లను కూల్చివేస్తున్నారని విమర్శించారు.
భూగర్భ జలాలు పెంచి రైతులను ఆదుకోవాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెక్ డ్యామ్లు కడితే, ఈ ప్రభుత్వం వాటిని కూల్చివేస్తూ పొలాలను ఎడారిగా మారుస్తోందని మండిపడ్డారు. ప్రకృతి విపత్తుల వల్ల చెక్ డ్యామ్లు కొట్టుకుపోయాయని కట్టుకథలు చెబుతున్న కాంగ్రెస్ మంత్రులకు, రాజేంద్ర సింగ్ ఇచ్చిన నివేదిక ఒక 'చెంపపెట్టు' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇసుక మాఫియా కోసం రైతుల జీవితాలతో ఆడుకోవద్దని ఆయన హెచ్చరించారు.