పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 9 వేలకోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఎట్టకేలకు జనాల కంట పడ్డాడు. లండన్ పుర వీధుల్లో మీసం, గడ్డం పెంచి గుర్తుపట్టకుండా తయారయ్యాడు. లండన్లోని ఖరీదైన వెస్ట్ ఎండ్ ప్రాంతంలో వీధిలో నడుస్తూ వెళుతుండగా టెలిగ్రాఫ్ రిపోర్టర్ మిక్ బ్రౌన్ ఆయనను గుర్తించి, వెంబడించాడు. 'మీరు ఎన్నాళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఏం బిజినెస్ చేస్తున్నారు? ఇంకా ఎంతకాలం లండన్లో ఉంటారు? మీకు బ్రిటిష్ ప్రభుత్వం రాజకీయ ఆశ్రయమిచ్చిందా? మిమ్మల్ని అప్పగించాలని భారత ప్రభుత్వం చేసిన వినతిపై ఏమంటారు?'.. అంటూ ఆ రిపోర్టర్ ఆయనకు అనేక ప్రశ్నలు సంధించారు.. దానికి నీరవ్ 'సారీ.. నో కామెంట్స్' అక్కడినుంచి క్యాబ్ లో వెళ్ళిపోయాడు.
తాజాగా నీరవ్ మోదీ ప్రత్యక్షమైన నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ స్పందించింది. నీరవ్ ఎక్కడున్నారన్నది తమకు ముందే తెలుసని.. విదేశాంగ శాఖ అధికారి రవీష్ కుమార్ తెలిపారు. అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇదిలావుంటే లండన్ నగరంలోని వెస్ట్ ఎండ్ లో ఖరీదైన నివాసంలో ఉంటున్న నీరవ్ మోదీ కొత్తగా వజ్రాల వ్యాపారం చేస్తున్నట్టు టెలిగ్రాఫ్ పత్రిక బయటపెట్టింది. ఆక్స్ ఫోర్డ్ రోడ్డులోని సుమారు 9 మిలియన్ పౌండ్ల విలువైన అత్యంత ఖరీదైన ఎత్తైన సెంటర్ పాయింట్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు. 17వేల పౌండ్ల అద్దె చెల్లిస్తున్నట్టు పత్రిక రాసింది.