ఏపీలో పెట్టుబడిదారులకు అత్యుత్తమ ప్రోత్సాహకాలు

కెనడా – ఇండియా బిజినెస్ కౌన్సిల్ (CIBC) ప్రెసిడెంట్ విక్టర్ థామస్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

Update: 2025-12-11 08:05 GMT

టొరంటో (కెనడా): కెనడా – ఇండియా బిజినెస్ కౌన్సిల్ (CIBC) ప్రెసిడెంట్ విక్టర్ థామస్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... ఎఐ, క్వాంటమ్ వంటి భవిష్యత్ సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. తూర్పుతీరంలో భారీ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది. ఇటీవల గూగుల్ సంస్థ విశాఖపట్నంలో ఎఐ హబ్, డాటా సెంటర్ పై $15 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ఎఫ్ డిఐ గా ఉంది. సెమీ కండక్టర్స్, ఐటి, ఎలక్ట్రానిక్స్, డాటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు ఎపిలో అత్యుత్తమ ప్రోత్సాహకాలను అందిస్తున్నాం. అమరావతి రాజధానిలో రూ.65వేల కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. విమానాశ్రమయాలు, పోర్టులు, లాజిస్టిక్స్, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టేందుకు కెనడియన్ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిందిగా లోకేష్ విజ్ఞప్తి చేశారు.

భారత్-కెనడా మధ్య వారధి సీఐబీసీ

సిఐబిసి ప్రెసిడెంట్ విక్టర్ థామస్ మాట్లాడుతూ... కెనడా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (C-IBC) ఇరుదేశాల నడుమ వాణిజ్యం, పెట్టుబడులను పెంచడం, భాగస్వామ్యాలను సులభతరం చేసేందుకు వారధిగా పనిచేస్తుంది. ఆర్థిక, సాంకేతికత, విద్యుత్, వ్యవసాయం తదితర రంగాల్లో మార్కెట్ లీడర్లను గుర్తించి నెట్‌వర్కింగ్ ద్వారా ప్రభుత్వాలకు సలహా ఇవ్వడంపై దృష్టి సారిస్తుంది. రెండు దేశాల మధ్య ఆర్థిక కారిడార్‌ను బలోపేతం చేయడమే దీని లక్ష్యం. ఉన్నత స్థాయి ఫోరమ్‌లు, వ్యాపార మిషన్‌లు, నిపుణులతో రౌండ్‌టేబుల్స్ సమావేశాలు నిర్వహించి ఇరుదేశాల్లో ఉన్న అవకాశాలను వివరిస్తాం. ముఖ్యంగా SMEలకు భారతీయ మార్కెట్‌లో పెరుగుతున్న అవకాశాలను నావిగేట్ చేయడంలో సహకరిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికాభివృద్ధికి తమవంతు సహాయ, సహకారాలు అందిస్తామని విక్టర్ థామస్ పేర్కొన్నారు.

Tags:    

Similar News