Punganur Tragedy: అన్నమయ్య జిల్లాలో విషాదం.. బైక్ నుంచి వెలువడిన విషవాయువు పీల్చి ఒకే కుటుంబంలో నలుగురు మృతి
Punganur Tragedy: అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఒకే కుటుంబంలో నలుగురు మృతి. బైక్ నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ విషవాయువు పీల్చడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
Punganur Tragedy: అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో శనివారం రాత్రి అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు తమ ఇంట్లోనే ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో భార్యాభర్తలతో పాటు ఇద్దరు చిన్నపిల్లలు ఉండటం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రాత్రంతా ఇంట్లో బైక్ ఇంజిన్ను ఆన్ చేసి ఉంచడం వల్ల వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ వాయువే ఈ మరణాలకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
పోలీసులు.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ కుటుంబ యజమాని మురళి ఇటీవల తన ద్విచక్ర వాహనం ఇంజిన్ను బోర్ చేయించారు. ఇంజిన్ సాఫీగా తిరగాలంటే (రన్నింగ్ కోసం) రాత్రంతా బైక్ను స్టార్ట్ చేసి ఉంచాలని మెకానిక్ సూచించినట్లు తెలుస్తోంది. మెకానిక్ మాటప్రకారం ఆ బైక్ యజమాని, తన బైక్ను ఇంటి లోపలే ఉంచి స్టార్ట్ చేసి ఉంచాడు.
రాత్రి సమయంలో మురళి తండ్రి రామచంద్రయ్య, కొడుకు కార్తీక్, కవల కుమార్తెలు చరిత, చందన కింది గదిలో నిద్రపోయారు. మురళి, అతని భార్య పై గదిలో నిద్రపోయారు. ఇల్లు ఇరుకుగా ఉండడం.. పైగా గదిలో కిటికీలు, తలుపులు గట్టిగా వేసేయడం ప్రమాదానికి కారణమైంది. బైక్ ఆన్ లోనే ఉండడంతో బైక్ సైలెన్సర్ నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సయిడ్ విషవాయువు గది అంతా ఆక్రమించింది. దీంతో గాఢ నిద్రలో ఉన్న వారు ఆ విషవాయువును పీల్చడంతో రక్తంలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి, నిద్రలోనే ప్రాణాలు విడిచారు.
ఉదయం పై గదిలో నిద్రపోయిన మురళి దంపతులు కిందికి వచ్చి చూసేసరికి రామచంద్రయ్య, పిల్లలు మొత్తం నలుగురు అపస్మారక స్థితిలో కనిపించడంతో అవాక్కయ్యారు. మురళి దంపతులు పై గదిలో పడుకోవడం వలన ప్రాణాలు నిలుపుకున్నారు. కానీ, ఒకేసారి తండ్రిని, ముగ్గురు పిల్లలను కోల్పోవడంతో మురళి, ఆయన భార్య కన్నీరు మున్నీరవుతున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. చిన్న తప్పిదంతో ఒకే కుటుంబంలోని నలుగురు మరణించడంతో స్థానికంగా విషాదం నెలకొంది. ఈ ఘటనపై పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.