ప్రజలకు అండగా ఉండాలని పాదయాత్ర ద్వారా గతేడాది నవంబర్ 6వ తేదీన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా శుక్రవారం ఉదయం 53వ రోజు పాదయాత్రను ఆయన పుంగనూరు నియోజకవర్గం కురవల్లి శివారు నుంచి ప్రారంభించారు. పిల్లలను బడికి పంపితే ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. గండ్లపల్లి, కంభంవారిపల్లి మీదుగా కందూరి క్రాస్ చేరకున్న వైఎస్ జగన్ ఇక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఇంటి నుంచి డాక్టర్, ఇంజనీర్ కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుత ఇచ్చే వెయ్యి రూపాయల పింఛన్ను రెండువేలకు పెంచుతామని హామి ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పింఛన్ వయసును 45 ఏళ్లకు తగ్గిస్తామన్నారు. ఇక జగన్కు ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలుకుతున్నారు. కందూరు క్రాస్ నుంచి సదాం, భట్టువారిపల్లి, గొడ్కవారిపల్లి వరకు ఆయన పాదయాత్ర కొనసాగనుంది.