ఏపీకి చేయూతివ్వండి : కేంద్ర మంత్రిని కోరిన సీఎం
న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు భేటీ అయ్యారు. పూర్వోదయ, సాస్కీ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ కు చేయూత ఇవ్వాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు భేటీ అయ్యారు. పూర్వోదయ, సాస్కీ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ కు చేయూత ఇవ్వాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరారు. కరువు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చేందుకు, సాగునీటి అవసరాల కోసం గోదావరి వరద జలాల మళ్లింపు కోసం చేపట్టే పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
పూర్వోదయతో గ్రోత్ ఇంజన్ గా ఏపీ
దేశంలోని తూర్పు ప్రాంత రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి తోడ్పడే పూర్వోదయ పథకం వికసిత్ భారత లక్ష్యాన్ని చేరుకునేందుకు, జాతీయ ఆర్థిక వ్యవస్థకు చోదకశక్తిగా నిలుస్తుందని సిఎం చంద్రబాబు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల కనెక్టివిటీ, సాగునీటి పారుదల వ్యవస్థల ఆధునీకరణ, మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక కారిడార్లు, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ల నిర్మాణం, విద్య వైద్య రంగాల సదుపాయాల కల్పన కోసం పూర్వోదయ పథకం కీలకంగా మారుతుందన్నారు. తద్వారా ఆయా గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన ఆర్దిక అవకాశాలను అందిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
విద్య, నైపుణ్యాకల్పన, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, హౌసింగ్, రహదారులు, సాగునీటి ప్రాజెక్టుల లాంటి కీలకమైన రంగాల్లో పూర్వోదయ నిధులు అందించి ఏపీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ పథకం కింద ప్రాధాన్యతా క్రమంలో చేపట్టే ప్రాజెక్టులకు పాలనాపరమైన నిబంధనల్ని సరళీకృతం చేయాలని, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వీటిని వినియోగించుకునేలా వెసులుబాటు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు.
సాస్కీతో ఏపీకి చేయూత
సాస్కీ కింద మంజూరైన వివిధ ప్రాజెక్టులను సత్వరం చేపట్టాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. విశాఖలో యూనిటీమాల్ నిర్మాణం, అఖండ గోదావరి కింద చేపట్టిన హావ్ లాక్ బ్రిడ్జి పునర్నిర్మాణ పనులు, గండికోట పర్యాటక ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో మూడు వర్కింగ్ విమెన్ హాస్టళ్ల నిర్మాణాల పూర్తికి నిధులివ్వాలని కోరారు.