వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.... సోషల్ మీడియా సమరానికి సై అంటోంది. తూర్పుగోదావరిలో ఇవాళ జరగనున్న కీలక సమావేశంలో... సోషల్ మీడియా టీమ్స్కి జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలతోపాటు వైసీపీ హామీలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక యాప్లను సిద్ధంచేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.
2019లో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తోన్న వైసీపీ అధినేత... ప్రతి విషయంలో పక్కా స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను సమర్ధవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తోన్న వైసీపీ సోషల్ మీడియా టీమ్స్తో ఇవాళ జగన్మోహన్రెడ్డి సమావేశంకానున్నారు. ఈరోజు పాదయాత్ర జరిగే రాజోలు నియోజకవర్గం తాటిపాకలో 175 నియోజకవర్గాల సోషల్ మీడియా అండ్ ఎన్నారై టీమ్స్తో అలాగే వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్తో భేటీ కానున్నారు.
సోషల్ మీడియా టీమ్స్ ఏవిధంగా పనిచేయాలి, ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్లాలి, ప్రభుత్వ వైఫల్యాలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అంశాలపై జగన్ అండ్ ప్రశాంత్ కిశోర్లు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ కార్యక్రమాలైనా, జగన్ ప్రసంగాలైనా ఇలా ఏదైనాసరే క్షణాల్లో ప్రజల్లోకి చేరేవిధంగా ప్రత్యేకంగా యాప్స్ను రూపొందించారు. వైసీపీలో ప్రస్తుతం సోషల్ మీడియా టీమ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. దాంతో ఈ టీమ్స్ను సమర్ధవంతంగా ఉపయోగించుకుని మరింతగా ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ భావిస్తోంది.