అమరావతి: ఎకనామిక్ టైమ్స్ ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డ్ ప్రకటించడంపై కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ‘‘ఈ తరహా అవార్డులు ఎప్పుడూ నేను తీసుకోలేదు. విదేశీ యూనివర్సిటీలు డాక్టరేట్ ఇస్తామన్నా సున్నితంగా తిరస్కరించాను. ఈ అవార్డు రావటం వెనుక క్రెడిట్ అంతా నా సహచరులు, అధికారులు, కలెక్టర్లదే. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో గతంలో గుజరాత్ మొదటిస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ప్రతి ఏడాదీ ఏపీనే అగ్రస్థానంలో నిలిచింది. ఎన్నిసార్లు నిబంధనలు మార్చినా మనమే నెంబర్ వన్ గా ఉన్నాం. మనం ఇప్పుడు గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం.’’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.
18 నెలల్లో 25 పాలసీలు
‘‘18 నెలల్లో 25 పాలసీలను తీసుకువచ్చి పరిశ్రమలను, పెట్టుబడులను తీసుకువస్తున్నాం. ప్రతి నెలా ఎస్ఐపీసీ, ఎస్ఐపీబీల ద్వారా పెట్టుబడులకు ఆమోదం తెలియచేస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పూర్తి సహకారం అందిస్తున్నారు. ఇక కేంద్రం ఇస్తున్న సహకారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరువకూడదు. గత ప్రభుత్వంలో ద్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించగలుగుతారా ఆని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని చెప్పాం, చేసి చూపిస్తున్నాం. ప్రజలు, పరిశ్రమలు ఏపీని విశ్వసిస్తున్నాయి.’’ అని సీఎం అన్నారు.
దేశంలోని ఏ రాష్ట్రమూ తీసుకురాని విధంగా పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ఎస్క్రో ఖాతాను తీసుకువచ్చామని సీఎం చంద్రబాబు చెప్పారు. దీనికి త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. లేబర్ కోడ్ గైడ్ లైన్స్ విషయంలోనూ కేంద్రం ఏపీని సంప్రదించిందని చెప్పారు. అందుకే ఇప్పుడు గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ను అమలు చేయాలని నిర్ణయించాం అని సీఎం తెలిపారు.