కోవెలకుంట్లలో విషాదం ట్రాక్టర్ కిందపడి పదో తరగతి విద్యార్థి దుర్మరణం
నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ కిందపడి బనగానపల్లె మోడల్ స్కూల్ విద్యార్థి కిషోర్ (15) మృతి చెందాడు.
కోవెలకుంట్లలో విషాదం ట్రాక్టర్ కిందపడి పదో తరగతి విద్యార్థి దుర్మరణం
కోవెలకుంట్ల (నంద్యాల జిల్లా): నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ట్రాక్టర్ కిందపడి కిషోర్ (15) అనే విద్యార్థి మృతి చెందాడు. పదో తరగతి పరీక్షల మధ్యలో దొరికిన సెలవు ఆ విద్యార్థి జీవితంలో చివరి రోజవుతుందని ఎవరూ ఊహించలేదు.
వివరాల్లోకి వెళ్తే..
బనగానపల్లె మండలం రామతీర్థం గ్రామానికి చెందిన కిషోర్, బనగానపల్లెలోని మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం పరీక్షలు జరుగుతుండగా, ఈరోజు పరీక్షలకు సెలవు కావడంతో కోవెలకుంట్లలోని తన బంధువుల ఇంటికి వెళ్లొస్తానని తల్లిదండ్రులకు చెప్పి బయలుదేరాడు. కోవెలకుంట్ల పట్టణంలో వెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గమనించి కిషోర్ను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో కిషోర్ మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు కళ్లముందే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రామతీర్థం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.