పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎంపీలను డిస్ క్వాలిఫై అయ్యేలా కఠినచర్యలు తీసుకోవాలన్న వైసీపీ డిమాండ్ నెరవేరుతుందా? ఢిల్లీలో ఆ పార్టీ నేతలు లోకసభ స్పీకర్కు ఇచ్చిన వినతిపత్రానికి ఫలితం ఉంటుందా? ఓ వైపు ఉపరాష్ట్రపతి పార్టీ ఫిరాయింపు దారులపై మూడు నెలల్లోపు యాక్షన్ తీసుకోవాలన్న వ్యాఖ్యలు వైసీపీకి వరంగా మారుతాయా ?
పార్టీ ఫిరాయింపుల అంశాన్ని సాధ్యమైనంతగా ఉపయోగించుకోవాలని వైసీపి భావిస్తోంది. ఇందులో భాగంగా వైసీపీ నుంచి గెలిచిన నలుగురు ఎంపీలు పార్టీ ఫిరాయించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎంపీలపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఎంపీలకు మద్దతు చేకూర్చే విధంగా రాజ్యసభ చైర్మన్ పార్టీ ఫిరాయించిన వారిపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని ప్రకటన చేశారు. దీంతో ఇప్పడందరి చూపు పార్టీ ఫిరాయించిన ఎంపీలపై పడింది.
2014 ఎన్నికల్లో ఎస్పీవై రెడ్డి, అరకు ఎంపీ కొత్తపల్లి గీత, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కర్నూల్ ఎంపీ బుట్టా రేణుకలు పార్టీ ఫిరాయించారు. పొంగులేటి టీఆర్ఎస్లో చేరితే ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత, బుట్టా రేణుకలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మూడున్నరేళ్లుగా పార్టీ ఫిరాయించిన ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని వైసీపీ కోరుతోంది. పార్టీ మారినందున రాజ్యాంగంలోని పదో షెడ్యూలును అనుసరించి జంప్ జిలానీలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలు చేసింది.
మరో వైపు రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేసేందుకు టీడీపీ 22 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీని బహిరంగంగా తమ పార్టీలో చేర్చుకుందని వైసీపీ ఆరోపిస్తోంది. వీరిలో నలుగుర్ని మంత్రి వర్గంలోకి తీసుకోవడం ఫిరాయింపులకు పరాకాష్ట పార్టీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనైనా తాము వేసిన పిటిషన్కు... ఓ పరిష్కారం లభిస్తుందని వైసీపీ పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి మరి.