బెజవాడలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. విజయవాడ సెంట్రల్ సీటుపై ఆశలు పెట్టుకున్న వంగవీటిని కాదని మల్లాది విష్ణుకు కేటాయించడంతో వైసీపీలో అసమ్మతి మళ్లీ భగ్గుమంది. అయితే సెంట్రల్ వద్దంటున్న పార్టీ తూర్పును ఆఫర్ చేసింది. మరి వైసీపీపై తిరుగుబావుటా ఎగురవేస్తారా..? లేక అధిష్టానం నిర్ణయానికి కట్టుబడుతారా..? వంగవీటి రాధా భవిష్యత్ ప్రణాళిక ఏంటి..?
బెజవాడ సెంట్రల్ సీటు వ్యవహారం వైసీపీలో చిచ్చురాజేసింది. ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న వంగవీటి రాధా రెండు రోజులుగా తన అనుచరులతో సమావేశం నిర్వహిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా సోమవారం వంగవీటి రంగా విగ్రహం దగ్గర రాధా అనుచరులు ఆందోళన చేపట్టారు. పెట్రోల్ పోసుకుని నిరసన చేపట్టారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన రాధా ఆందోళనకారులను శాంతింపజేశారు. పార్టీ ఆదేశం వచ్చేవరకు వేచి చూడాలని సర్దిచెప్పారు.
అయితే సెంట్రల్ వ్యవహారాన్ని కొలిక్కితేవాలని భావించిన వైసీపీ అధిష్టానం టిక్కెట్ను మల్లాదివిష్ణుకు కట్టబెట్టింది. అంతేకాకుండా వంగవీటి రాధా కోసం ప్రత్యామ్నాయంగా మచిలీపట్నం ఎంపీ సీటు లేదా బెజవాడ ఈస్ట్ టిక్కెట్ను ఆఫర్ చేస్తోంది. వంగవీటి కుటుంబానికి ఎలాంటి అన్యాయం జరగలేదని అంబటి రాంబాబు హెచ్ఎం టీవీతో తెలిపారు. ఇటీవల వైజాగ్లో జరిగిన సమావేశంలో బ్రాహ్మణ సంఘాలు విజయవాడ సెంట్రల్ సీటు కావాలని కోరాయని అందుకే మల్లాది విష్ణుకి కేటాయించినట్లు వివరించారు.
అయితే సెంట్రల్ సీటు వ్యవహారంపై వివరణ కోరేందుకు పార్టీ అధిష్టానం నుంచి ఎవరూ అందుబాటులో రాకపోయే సరికి రాధా తన అనుచరులు, రంగా మిత్రమండలి సభ్యులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నారు. అసలు పార్టీలో ఉండాలా..? లేక గతంలో గెలిచిన తూర్పు నుంచే పోటీ చేయాలా అన్నదానిపై ఆలోచిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో రాధా తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా.. రాధా వెంటే ఉంటామని.. ఆయన అనుచరులు ఇదివరకే స్పష్టం చేశారు.