మంత్రినే చంపేస్తామని బెదిరించి భారీగా డబ్బు గుంజాలని ఓ జ్యోతిష్యుడు వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. మంత్రి అచ్చెన్నాయుడుకు బెదిరింపు కాల్స్ కేసును సిక్కోలు పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఊహించని విధంగా ప్రముఖ జ్యోతిష్యుడు కాళిదాసు శర్మతోపాటు, అతని అనుచరుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో ఈ జ్యోతిష్యుడు... విశ్వాన్ని కాలసర్పదోషం వెంటాడుతుందని, అది నివారించాలంటే నాగ కల్యాణం చేయాలని, రెండు పాములకు పెళ్లి చేశాడు.
విజయనగరం జిల్లా పార్వతీపురంలో జ్యోతిష్యుడిగా, యాజిగా పేరుగాంచిన మురపాక కాళిదాసుశర్మ ప్రముఖులకు నిత్యం టచ్లో ఉంటూ వారికి గ్రహాలు అనుకూలంగా లేవని శాంతిహోమాలు, ప్రత్యేకపూజలు జరిపించాలని భారీగా డబ్బు గుంజేవాడు. ఒడిసా రాయగడలో నివాసముంటున్న జోస్యుల శంకరరావును అనుచరుడిగా ఎంచుకున్నాడు. ఇద్దరూ కలిసి ఉత్తరాంధ్రలో ప్రముఖులే లక్ష్యంగా వారిలో ప్రాణభీతి లేవనెత్తి భారీగా డబ్బులు దండుకునేందుకు పన్నాగం పన్నారు. అందులో భాగంగా అచ్చెన్నను సైతం బెదిరించారు.
రాయగడలో ఓ సెల్ దుకాణంలో గిరిజనుడి పేరిట సిమ్ కొనుగోలు చేసి, టెక్కలిలోని మంత్రి అనుచరుడికి ఫోన్ చేసి తాము నక్సలైట్లమని, అచ్చెన్నను చంపేస్తామని హెచ్చరించారు. ప్రాణహాని నిజమేనని భావించేలా చేసేందుకు శంకర్రావు ఒడిసా నుంచి జిలెటిన్ స్టిక్స్ తెప్పించి అచ్చెన్న పయనించే మార్గంలో ట్రాఫిక్ సిబ్బంది ఏర్పాటుచేసిన టైర్లలో అమర్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు ముమ్మరంచేసి జిలెటిన్ స్టిక్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు వేగవంతం చేయడంతో శంకర్రావు పోలీసులకు పట్టుబడ్డారు. అతన్ని విచారించగా విషయం చెప్పేశాడు. జోస్యుల శంకరరావు(ఏ2)ను మెళియాపుట్టి జంక్షన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎస్పీ చెప్పారు. అతని గురువు మురపాక కాళిదాసు (ఏ1)ను పార్వతీపురం ఆశ్రమంలో ఆదివారం అరెస్టు చేశామన్నారు. ఈ కేసును చాకచక్యంగా సాధించిన టెక్కలి సీఐ, ఎస్ఐలు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.సమావేశంలో శ్రీకాకుళం డీఎస్పీ వి.భీమారావు, టెక్కలి డీఎస్పీ రాఘవ పాల్గొన్నారు.