‘అవిశ్వాసం’పై టీఆర్ఎస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Update: 2018-03-20 06:45 GMT

అవిశ్వాస తీర్మానంపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన భువనగిరి పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్యగౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఆయన, గత నాలుగేళ్లుగా కాపురం చేసిన పార్టీపై ఇప్పుడు అవిశ్వాసం పెడితే తామెందుకు సహకరించాలని ప్రశ్నించారు. తమ పార్టీ అధినేతతో సంప్రదింపులు జరిపి వారేమైనా అవిశ్వాసాన్ని పెట్టారా? అని ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మానం పిల్లలాట కాదన్నారు. పక్కింట్లో పెళ్లి అయితే మా ఇంట్లో రంగులు వేసుకోవాల్సిన అవసరంలేదు... అని నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు మాత్రమే తాము సభలో రిజర్వేషన్ల కోటా పెంపునకు డిమాండ్ చేస్తున్నామే తప్ప, ఎవరి కోసమో వెల్ లోకి వెళ్లడం లేదని అన్నారు. ఈ నిరసన అవిశ్వాస తీర్మానం పెట్టిన తరువాత మొదలైనది కాదని, రెండు వారాలుగా తాము నిరసనలు తెలుపుతూనే ఉన్నామని గుర్తు చేశారు. తమకు కేంద్రం నుంచి సరైన హామీ లభించేంత వరకూ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కేసీఆర్ ప్రారంభించనున్న థర్డ్ ఫ్రంట్ లో చంద్రబాబు కలుస్తారా? లేదా? అన్నది ఇప్పటికిప్పుడు సమాధానం లభించే ప్రశ్న కాదని నర్సయ్య గౌడ్ వెల్లడించారు.

Similar News