పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్పై లైంగిక వేధింపుల ఆరోపణలు కొన్ని మీడియా సంస్థలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరు మహిళలపై ఎంపీ లైంగిక దోపిడీకి పాల్పడ్డారంటూ ప్రధానికి పాత్రికేయుల లేఖ రాశారంటూ ఓ కథనం చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వ్యవహారంపై పోలీసులు స్పందించారు. ఎంపీ సుమన్పై లైంగిక వేధింపుల ఆరోపణలు అవాస్తవమని మంచిర్యాల సీఐ మహేష్ స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడతూ సంధ్య, విజేత అనే ఇద్దరు మహిళలు మార్ఫింగ్ ఫోటోలతో ఎంపీ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో వారిపై ఆరు నెలల క్రితమే కేసు నమోదు చేసినట్లు చెప్పారు. దురుద్ధేశంతోనే వారు ఎంపీపై ఆరోపణలు చేస్తున్నారని సీఐ తెలిపారు. గతంలోనూ ఈ ఇద్దరు అమ్మాయిలు పలువురిని ఇలాగే మోసం చేశారని వెల్లడించారు. సంద్య, విజేతలపై 2018 ఫిబ్రవరి 6న కేసు నమోదు చేశామన్నారు. ఎంపీని ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేసి లబ్ది పొందాలని చూశారని, ఎంపీ కుటుంబ సభ్యుల పోటోను మార్పింగ్ చేసి ఆన్లైన్లో పెట్టారని సీఐ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ బంజారహిల్స్లోను కేసులు నమోదయ్యాయని, 420, 292 A, 419, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఇరువురిపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ మహేష్ తెలిపారు.