ఆందోళనలు.. నిరసనలు.. నినాదాలు.. గొడవలు.. ఎన్నికల వేళ తెలంగాణలో ఏ పార్టీ కార్యాలయం చూసినా.. ఇవే సీన్లు కనిపిస్తున్నాయి. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీల వరకు.. అన్ని ఆఫీస్లు తాళాలతో దర్శనమిస్తున్నాయి. ఆశావహుల హంగామాతో సినిమా సీన్లు కనిపిస్తున్నాయి. కూటమి పార్టీలింకా అభ్యర్థులను ప్రకటించకున్నా.. తమకెక్కడ టిక్కెట్ రాదో అని నిరసనలతో హోరెత్తిస్తున్నారు. తమకే టిక్కెట్ కేటాయించాలంటూ ఆందోళనలతో తామేంటో చూపిస్తున్నారు. టీఆర్ఎస్ లో కూడా అసమ్మతి జ్వాల రేగింది. తెలంగాణ భవన్ ముందు ఆశావహులు.. ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. తాజాగా ఖైరతాబాద్ టిక్కెట్ ఇవ్వాలంటూ గోవర్ధన్రెడ్డి అనుచరులు ఆందోళన చేపట్టారు. దీంతో తెలంగాణ భవన్ సిబ్బంది.. గేట్లకు తాళాలు వేసి.. భద్రత కల్పించారు. ఈ సందర్భంగా నిజమైన తెలంగాణ వీరులకే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన దానం నాగేందర్కు ఖైరతాబాద్ టిక్కెట్ ఇవ్వొద్దంటూ నినాదాలు చేశారు.