ఎంపీ శివప్రసాద్‌పై తమన్నా‌ ఫిర్యాదు

Update: 2018-08-13 09:14 GMT

చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వర్షాకాల సమావేశాల్లో తమ మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించారని ట్రాన్స్ జెండర్స్ అసోసియేషన్ ప్రతినిధి తమన్నా సింహాద్రి విజయవాడ గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీ పట్ల కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు సమావేశాల సందర్భంగా పార్లమెంటు ఆవరణంలో టీడీపీ ఎంపీలు ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆందోళనలో భాగంగా ఎంపీ శివప్రసాద్ రోజుకో వేషధారణలో తన నిరసనను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో ఆయన శుక్రవారం హిజ్రా వేషంలో ఆందోళన నిర్వహించారు. పార్లమెంటు ప్రాంగణంలో ఆందోళనలో భాగంగా స్వలింగ సంపర్కుల వేషధారణలో ఉన్న శివప్రసాద్‌.. ట్రాన్స్ జెండర్ అని చెప్పడం దారుణమని అన్నారు. తాము మహిళలతో సమానమని ఆమె అన్నారు. శరీర భాగాలు మార్చుకుని మహిళలతో సమానంగా జీవిస్తున్న తమను ఎంపీ అవమానించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Similar News