బురిడీ బాబా అరెస్ట్

Update: 2018-07-14 04:42 GMT

నమ్మినవారిని నట్టేట ముంచుతున్నారు కొందరు దొంగబాబాలు. జనం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచేస్తున్నారు. తాజాగా మరో బురిడీ బాబా బాగోతం వెలుగులోకి వచ్చింది. పూజలు, యజ్ఞాలు చేస్తే నగలు రెండింతలు అవుతాయని జనం సొమ్ములు కాజేస్తున్న ఆ దొంగబాబాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

కాషాయ దుస్తుల్లో కనిస్తున్న వీడే బురిడీ బాబా. పేరు రామశివానంద పుట్టింది కేరళలో. చిన్నప్పటి నుంచే సన్యాసం తీసుకున్న శివానంద వేదమంత్రాల పేరుతో జనాన్ని మోసం చేయడం ప్రారంభించాడు. ఎలాంటి సమస్యకైనా తన యజ్ఞ, యాగాలతో పరిష్కారం చూపుతానంటూ అమాయకుల్ని మోసం చేస్తున్నాడు. 

కలశంలో బంగారం పెట్టి పూజలు చేస్తే అరిష్టాలు తొలగిపోతాయని, మంచి జరుగుతుందని నమ్మించి మొత్తం దోచేస్తాడు. హైదరాబాద్ యూసుఫ్‌గూడలో తత్వపీఠం పేరుతో ఆధ్యాత్మిక ఆశ్రమం పెట్టి ప్రజలను మోసం చేస్తున్నాడు. యజ్ఞం చేసే సమయంలో ఇంట్లో ఉన్న బంగారం కలశంలో పెట్టి నెల రోజుల తర్వాత చూస్తే రెండింతలు అవుందని చెప్పి బురిడీ కొట్టిస్తున్నాడని సైబరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పారు. 

ఇలా ఈ దొంగబాబా హైదరాబాద్‌తోపాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల మోసాలకు పాల్పడి కిలోల కొద్దీ బంగారాన్ని సంపాదించాడు. ఈ బంగారు ఆభరణాలను ఆయన భార్య తేజస్విని అమ్మి సొమ్ము చేసేది. ఈ దంపతుల ఉచ్చులో ఎంతోమంది వ్యాపారులు, విద్యావంతులు, కొందరు పోలీసులు కూడా పడినట్టు తెలుస్తోంది. వీరి నుంచి 2కిలోల బంగారంతోపాటు ఒక వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Similar News