టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ ఈ ఎన్నికల్లో పోటీ చేయరా..? ఆయన్ని కేవలం ప్రచారానికి మాత్రమే ఉపయోగించుకుంటారా..? మహాకూటమిలో పెద్ద తలకాయగా ఉన్న కోదండరామ్ రాజకీయ భవిష్యత్తుపై.. అప్పుడే నిర్ణయం తీసుకున్నారా..? కాంగ్రెస్ కోర్ కమిటీ.. టీజేఎస్పై తీసుకున్న నిర్ణయాలు.. చర్చనీయాంశంగా మారాయి.
కూటమిలో పీటముడిగా మారిన సీట్ల సర్దుబాట్లను.. కొలిక్కి తెచ్చేందుకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ.. వేగం పెంచింది. జానారెడ్డి అధ్యక్షతన సమన్వయ కమిటీని నియమిస్తూ.. కోర్ కమిటీ నిర్ణయం తీసుకుంది. జానాతో పాటు.. పొన్నం ప్రభాకర్, చిన్నారెడ్డి, వినయ్ కుమార్ ఉన్నారు. దసరా లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని డెడ్లైన్ విధించింది. దీంతో ఆదివారం సాయంత్రం జానారెడ్డి తన నివాసంలో టీజేఎస్ నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా టీజేఎస్ నేతలు 16 మంది అభ్యర్థుల జాబితాను జానారెడ్డికి అందజేశారు. దీంతో జానారెడ్డి.. కోర్ కమిటీ ప్రతిపాదనను వారి ముందుంచారు.
ముఖ్యంగా టీజేఎస్కు కేటాయించే స్థానాల్లో బరిలోకి దిగే అభ్యర్థులు కాంగ్రెస్ గుర్తుపైనే పోటీ చేయాలని కోర్ కమిటీ ప్రతిపాదించింది. దీంతో వేర్వేరు గుర్తులపై ప్రజల్లో అయోమయానికి అవకాశం ఇవ్వొద్దనే అభిప్రాయాన్ని కోర్ కమిటీ వెల్లడించింది. అంతేకాకుండా.. కోదండరామ్ను బరిలోకి దించకుండా కేవలం ప్రచారానికే ఉపయోగించుకోవాలనే ప్రతిపాదన కోర్ కమిటీ చేసింది. దీంతో ప్రచారం సమయంలో కొన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టడంలో సఫలం అవుతామని భావిస్తున్నారు. అయితే అధికారంలోకొచ్చాక కోదండరామ్కు డిప్యూటీ సీఎం హోదాతో సమానమైన పదవిని అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు.
రాహుల్ టూర్ కూడా కన్ఫర్మ్ కావడంతో.. దసరా లోపే.. కూటమిలో సీట్ల సర్దుబాట్లను తేల్చాలని డెడ్లైన్ పెట్టుకున్నారు. ఇప్పటికే 70 నియోజకవర్గాల్లో అభ్యర్థులపై ఏకాభిప్రాయం వచ్చిందని నేతలు చెబుతున్నారు. అయితే అభ్యర్థుల జాబితాను ఒకేసారి ప్రకటించాలా..? లేక విడతలవారిగా ప్రకటించాలా అన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని చెబుతున్నారు.