ముందస్తు ఎన్నికలవేళ తెలంగాణ కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. టీకాంగ్రెస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలతో పాస్పోర్టు, వీసా తీసుకున్న కేసులో జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. 13ఏళ్ల క్రితం నమోదైన కేసులో కీలక సమాచారం సేకరించిన పోలీసులు అర్ధరాత్రి పటాన్చెరు దగ్గర అరెస్ట్ చేసి హైదరాబాద్ టాస్క్ఫోర్స్ ఆఫీస్కు తరలించినట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షల అనంతరం జగ్గారెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
జగ్గారెడ్డి తప్పుడు పత్రాలతో పాస్పోర్ట్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 2004లో తన భార్యాపిల్లల పేరుతో వీసాలు పొంది గుజరాత్కి చెందిన ముగ్గుర్ని అమెరికా తీసుకెళ్లినట్లు జగ్గారెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి. గుజరాత్ పోలీసులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన హైదరాబాద్ పోలీసులు అర్ధరాత్రి జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో సంగారెడ్డి, నిజామాబాద్కి చెందిన మరో ఇద్దరి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మనుషుల అక్రమ రవాణాకు పాల్పడినట్లు జగ్గారెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి. తన కుటుంబ సభ్యుల పేరుతో ఇద్దరు మహిళల్ని, ఒక అబ్బాయిని అమెరికా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. 2004లో ఎమ్మెల్యేగా ఉండగా తన పదవిని అడ్డం పెట్టుకుని మనుషుల అక్రమ రవాణాకి పాల్పడినట్లు జగ్గారెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి. తన భార్య నిర్మల, కూతురు జయలక్ష్మి, కుమారుడు భరత్సాయిరెడ్డి పేర్లతో ముగ్గుర్ని అమెరికా తీసుకెళ్లినట్లు ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.
జగ్గారెడ్డి అరెస్ట్ విషయం తెలుసుకున్న టీకాంగ్రెస్ నేతలు అర్ధరాత్రి డీజీపీని కలిశారు. డీజీపీ మహేందర్రెడ్డి ఇంటికి వెళ్లిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, రేవంత్, భట్టివిక్రమార్క, సునీతారెడ్డిలు జగ్గారెడ్డి అరెస్ట్పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జగ్గారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఉత్తమ్ మండిపడ్డారు. పోలీసులు కేసీఆర్ చెప్పినట్లు వింటున్నారని ఆరోపించారు. జగ్గారెడ్డి అక్రమ అరెస్ట్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం చేస్తోందని ఉత్తమ్ తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. నకిలీ పత్రాలతో... తప్పుడు పాస్పోర్ట్తో అమెరికా వెళ్లినట్లు, మనుషుల అక్రమ రవాణాకు పాల్పడినట్లు పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 2004లోనే దొంగ పాస్పోర్టుల వ్యవహారంలో కేసులు నమోదైన కేసీఆర్, హరీష్రావులను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.
జగ్గారెడ్డి అరెస్ట్ కు నిరసనగా ఈరోజు సంగారెడ్డి బంద్ కి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇప్పటికే సంగారెడ్డిలో ఆందోళనకు దిగిన జగ్గారెడ్డి అనుచరులు రోడ్లపై టైర్లు కాల్చి నిరసన తెలిపారు. 65వ జాతీయ రహదారిపై అర్ధరాత్రి ధర్నాకి దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు, జగ్గారెడ్డి అనుచరులు రోడ్డుకు అడ్డంగా కట్టెలను వేసి తగలబెట్టారు. జగ్గారెడ్డి అరెస్ట్ పై ఎలాంటి సమాచారం లేకపోవడంతో... ఆయన సతీమణి ఆందోళనకు గురయ్యారు. తాను కూడా టీవీల్లో చూసి మాత్రమే తెలుసుకున్నానని, పోలీసులు మరీ ఇంత దుర్మార్గంగా అర్ధరాత్రి సమయంలో అరెస్ట్ చేస్తారా? అంటూ జగ్గారెడ్డి భార్య నిర్మల కన్నీటి పర్యంతమైయ్యారు.