హైదరాబాద్‌లో బట్టబయలైన దొంగ బాబా బాగోతం

Update: 2018-10-29 05:29 GMT

హైదరాబాద్‌లో మరో దొంగ బాబా బాగోతం బట్టబయలైంది. మహిళా భక్తులపై లైంగిక దాడులు చేస్తున్నారంటూ హోమీ బాబా ఆశ్రమాన్ని బాధితులు ముట్టడించారు. మేడ్చల్‌ జిల్లా గోదుమకుంట గ్రామంలో ఉంటున్న హోమీ బాబా దూర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తరలించి వారికి డ్రగ్స్‌ అలవాటు చేస్తున్నారని తర్వాత వారిని లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ యువతి, ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆశ్రమం దగ్గర ఆందోళన చేపట్టారు. 

ఆశ్రమంలో 10 మందికి పైగా అమ్మాయిలున్నారని వారంతా 20 నుంచి 23 యేళ్ల లోపు వారేనని బాధిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యం బాగాలేకపోతే తమ బిడ్డలను ఆశ్రమానికి తీసుకొచ్చామని నెలల తరబడి తమ బిడ్డలతో తమను కలవనీయకుండా చేస్తున్నారని కన్నీరుమున్నీరవుతున్నారు. వారు కనీసం నడవలేకపోతున్నారని అంతలా బలహీనంగా మారిపోయారని చెప్పారు. ఇటు రంగంలోకి దిగిన పోలీసులు బాబా ఆశ్రమంపై దాడులు నిర్వహించారు. బాధితులంతా తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. నిర్వాహకులను అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు. 

Similar News