తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయన తనయుడు కేటీఆర్లపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. తమ అధినేత్రి సోనియా గాంధీని విమర్శిస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. విదేశాల్లో చదువుకున్నానంటూ చెబుతున్న కేటీఆర్ కనీస సంస్కారం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా కేటీఆర్ను అదుపులో పెట్టకపోతే విపత్కర పరిణామాలు తప్పవంటూ హెచ్చరించారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కుటుంబ పార్టీ ఎక్కడుండేదని వీహెచ్ ప్రశ్నించారు.
తెలంగాణ భవన్లో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో సోనియా గాంధీపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పెను దుమారం రేపాయి. ‘తెలంగాణ ఇచ్చింది అమ్మా కాదు.. బొమ్మా కాదు. ప్రజలు కొట్లాడి గుంజుకుంటేనే తెలంగాణ వచ్చింది. రాష్ట్రం ఇవ్వకపోతే ప్రజలు తంతారన్న భయంతో విధిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది’ అంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.