బ్యూటీ పార్లర్లో మేకప్ కోసమని వచ్చి చోరీలకు పాల్పడుతున్న ఓ మహళ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేపీహెచ్బీ పోలీసులు సూచిస్తున్నారు. ఇటీవల కొద్ది రోజుల వ్యవధిలోనే కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో రెండు వేరువేరు బ్యూటీ పార్లర్లలో మేకప్ చేయించుకునేందుకు వెళ్లి నగలతో ఉడాయించిన మహిళకు సంబంధించిన సీసీకెమెరాల్లో నమోదైన చిత్రాన్ని పోలీసులు బుధవారం విడుదలచేశారు. సదరు మాయలేడి వివరాలు తెలిపినవారికి రూ.25వేల నజరానా ఇవ్వనున్నట్లు కూకట్పల్లి ఏసీపీ భుజంగరావు ప్రకటించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..కేపీహెచ్బీ పరిధిలో రెండు వేర్వేరు బ్యూటీ పార్లర్లలో బంగారం దొంగతనం జరిగినట్టు ఫిర్యాదులు అందాయి. ఇక్కడి సీసీ కెమెరాలను పరిశీలించిన తరువాత రెండు కేసుల్లోనూ నిందితురాలు ఒకరేనని తేల్చారు. కేపీహెచ్బీ కాలనీ 6వ ఫేజ్, నిజాంపేటల్లో ఉన్న బ్యూటీ పార్లర్లకు వెళ్లి, అక్కడి యజమానిని మాటల్లో పెట్టి, మత్తు మందు కలిపిన బిళ్లలు ఇచ్చి ఆపై బంగారంతో ఉడాయించిందని అధికారులు తెలిపారు. ఈ మాయలేడితో జాగ్రత్తగా ఉండాలని, ఈమెను పట్టుకునేందుకు ప్రజల సహకారం కావాలని భుజంగరావు కోరారు.