టీడీపీ, వైసీపీ, బీజేపీలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా అంశంపై చర్చించేందుకు వామపక్ష నేతలతో సమావేశమయిన ఆయన పాలక, ప్రతిపక్షాలపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. ప్రత్యేక హోదా అంశంలో అధికార టీడీపీ పూటకో మాట రోజుకో బాట అన్న చందంగా నడుచుకుందని పవన్ ఆరోపించారు. హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీ తీసుకుని ఇప్పుడు మాత్రం ఆరోపణలు చేస్తున్నారంటూ విమర్శించారు. గడచిన నాలుగేళ్లలో ఏ ఒక్క రోజు ప్రతిపక్ష వైసీపీ చిత్తశుద్ధితో పోరాటం చేయలేదంటూ పవన్ ఆరోపించారు.
చంద్రబాబుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా రాసిన లేఖపై స్పందించాల్సిన అవసరం లేదని జనసేన అధినేత పవన్ తెలిపారు. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే ఆయన లేఖరాశారని ఆయనేమీ భారత ప్రభుత్వ ప్రతినిధి కాదని అన్నారు. ఒక పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి ఎలా మాట్లాడగలరని దానికి ఏంటి ప్రామాణికమని పవన్ ప్రశ్నించారు.