ఐదే ఐదు నిమిషాలు... అంతలోనే ఆ ప్రేమికుల ఆశలు అడిఆశలయ్యాయి. పెద్దలను ఎదిరించి మరి ఆర్యసమాజ్లో పెళ్లికి సిద్ధమయ్యారు. అంతే... ఇంతలోనే సమాచారం అందుకున్న అమ్మాయి కుటుంబసభ్యులు... సినిమా సన్నివేశాలను తలపించే రేంజ్లో పదికి పైగా మోటార్ సైకిళ్లతో వాలిపోయారు. కూతురిని పెళ్లి చేసుకోవాలనుకున్న యువకుడిని చితకబాదారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. మరో ఐదు నిమిషాల్లో కోరుకున్న జీవితంలోకి అడుగుపెడుతున్నామన్న యువ జంట ఆశలు ఆవిరయ్యాయి. పెద్దలను కాదని ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకోబోతున్న జంటను అమ్మాయి తరఫు బంధువులు విడదీశారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన నిజామాబాద్లో చోటు చేసుకుంది.
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్టకి చెందిన ప్రణదీప్, మాక్లూర్ మండలం కొత్తపల్లికి చెందిన సౌజన్య మూడేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. డిగ్రీ చదువుతుండగా స్నేహితుల ద్వారా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే వీరి పెళ్లికి కుటుంబసభ్యులు నిరాకరించడంతో ఆర్యసమాజ్లో ఒకటి అవ్వాలనుకున్నారు. సౌజన్య, ప్రణదీప్ల వివాహం సంగతి ఇరువురి కుటుంబసభ్యులకు తెలిసింది. అంతే... సినిమాని తలపించేలా, ఛేజింగ్లు, ఫైటింగ్ సీన్లు జరిగాయి. అమ్మాయి తరుపు బంధువులు పదుల సంఖ్యలో బైక్లతో ఆర్య సమాజ్కు చేరుకున్నారు. పెళ్లిని నిలిపివేయాలంటూ ఆర్య సమాజ్ సభ్యులను కోరారు. అయితే ఏదైనా సమస్య ఉంటే బయట తేల్చుకోవాలని వారు చెప్పడంతో అమ్మాయిని లాక్కెళ్లబోయారు. ఇంతలో వరుడు అడ్డుపడటంతో అతన్ని చితకబాదారు. తమతో రావడానికి నిరాకరిస్తున్న అమ్మాయి చెంపలు వాయించారు. ఆపై భుజాన వేసుకుని బైక్పై ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఘటనతో ఆర్య సమాజ్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బదిలీల హడావుడిలో ఉన్న పోలీసులు ఆర్య సమాజ్కు చేరుకోవడం ఆలస్యమైంది.