ఆపరేషన్ గరుడ చుట్టూ ఏపీ రాజకీయాలు

Update: 2018-10-27 05:24 GMT

ఏపీలో మళ్లీ ఆపరేషన్ గరుడపై మాటల మంటలు రాజుకున్నాయి. ఆపరేషన్ గరుడలో భాగంగానే జగన్ పై దాడి జరిగిందని టీడీపీ అంటోంది. జరుగుతున్న పరిణామాలు చూస్తూంటే శివాజీ చెప్పింది నిజమేనని భావించాల్సి వస్తోందని సాక్షుత్తూ చంద్రబాబే అన్నారు. మరోవైపు, జగన్ పై దాడిలో నిందితుడు శ్రీనివాసరావు ఉన్న ఫ్లెక్సీలోకి అసలు గరుడ పక్షి ఎలా వచ్చిందని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 

ఆపరేషన్ గరుడ ఇప్పుడీ పేరు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. సినీ యాక్టర్‌ శివాజీ చెప్పిన ఈ గరుడ పురాణం ప్రకారం టీడీపీ, చంద్రబాబు లక్ష్యంగా కేంద్రం ఆపరేషన్ గరుడ చేపట్టిందని, అందులో భాగంగానే ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై దాడి జరిగిందనే ప్రచారం ఊపందుకుంది. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్‌ జగన్‌పై జరిగిన దాడిపై మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు.... ఆపరేషన్ గరుడ నిజమేననిపిస్తోందన్నారు. శివాజీ చెప్పినట్లే జగన్‌పై ప్రాణహాని లేకుండా దాడి జరిగిందన్నారు.

ఆపరేషన్ గరుడ వెనుక స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ మొత్తం చంద్రబాబుదేనని వైసీపీ నేతలు ఆరోపించారు. శ్రీనివాసరావు ఫ్లెక్సీలోకి అసలు గరుడ పక్షి ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఇక బీజేపీ నేతలు కూడా చంద్రబాబు వ్యాఖ్యలపై సెటైర్లు వేస్తున్నారు. అంతా శివాజీ చెప్పినట్లే జరుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మొత్తానికి ఆపరేషన్ గరుడ చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. అయితే ఈ గరుడ పురాణం చెప్పిన శివాజీని అరెస్ట్‌ చేసి విచారణ జరిపితే అసలు నిజాలు బయటికి వస్తాయంటున్నారు వైసీపీ, బీజేపీ నేతలు.

Similar News