రాజకీయాల్లోకి మరో నందమూరి వారసురాలు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మహాకూటమి పొత్తులో భాగంగా కూకట్పల్లి స్థానంలో పోటీ చేయనున్న టీడీపీ అభ్యర్థిపై చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. నందమూరి హరికృష్ణ కుమార్తె.. సుహాసినిని నిలబెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విశాఖ నోవాటెల్లో సుహాసిని.. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. కూకట్పల్లిలో పోటీ చేసేందుకు ఆమె కూడా సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సాయంత్రం కూకట్పల్లి అభ్యర్థిని చంద్రబాబు అధికారికంగా ప్రకటించనున్నారు.